భద్రాద్రి కొత్తగూడెం, 01.08.2026
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ పెట్టుబడి మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలతో పాటు ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సుమారు రూ.52 కోట్ల మేర మోసం జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
భారీ పెట్టుబడి మోసం కేసులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలతో పాటు ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించారు.
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో, భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్లో లేబర్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని పలువురు బాధితులను నమ్మించి, సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించారు.
సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా, మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని, మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు.












