ములుగు, 2026-07-31
ములుగు జిల్లాలో రేషన్ కార్డుదారులందరికీ ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి అని, రేషన్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటానికి జూలై 31, 2026లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారి యూనిట్లు తొలగించబడతాయని హెచ్చరించారు.
ములుగు జిల్లాలోని రేషన్ కార్డుదారులందరికీ ఈ-కేవైసీ (e-KYC) తప్పనిసరి అని, రేషన్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండటానికి వెంటనే దీనిని పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) మరియు రాష్ట్ర ఆహార భద్రతా కార్డుల (FSC) కింద నమోదైన లబ్ధిదారులందరికీ ఈ-కేవైసీ (e-KYC) సరిచూడటం తప్పనిసరి చేసినట్టు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. రేషన్ కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ ప్రామాణీకరణను (ఆధార్ ఇ-కేవైసీ) పూర్తి చేయాలని ఆయన సూచించారు.
లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి తమ సమీపంలోని చౌక ధరల దుకాణాన్ని (రేషన్ షాప్) సందర్శించవచ్చు. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు తమ అసలు రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డును రేషన్ షాపుకి తీసుకెళ్లాలి. కార్డులో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు ఇ-పాస్ (ePoS) యంత్రంపై వ్యక్తిగతంగా తమ వేలిముద్రలను వేయాలి.
నిర్దేశిత గడువు అనగా తేది.31.07.2026 లోపు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే, వారి యూనిట్ తొలగించబడుతుంది. అంతేకాకుండా, ఆ వ్యక్తికి పంపిణీ చేసే రాయితీ సరకుల సరఫరా నిలిపివేయబడుతుంది.
ప్రతి నెల ఇచ్చే ఉచిత/రాయితీ రేషన్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి పౌర సరఫరాల శాఖకు సహకరించి, గడువు ముగిసేలోపు వెంటనే తమ రేషన్ షాపును సందర్శించి ఈ-కేవైసీ ప్రామాణీకరణను పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం లబ్ధిదారులందరికీ తెలియజేసింది.









